Rivalry between Minister Bhuma Akhilapriya and AV Subba Reddy is continuing still today <br /> <br />ఒకప్పుడు తన తండ్రికి అంతా తానై.. ఒకరకంగా భూమా నాగిరెడ్డి 'ఆత్మ' లాగా ముద్రపడ్డ ఏవీ సుబ్బారెడ్డితో మంత్రి అఖిలప్రియకు ఇప్పుడు ఏమాత్రం పొసగడం లేదు. భూమా చనిపోయిన నాటి నుంచే వీరిద్దరి మధ్య వైరం రగులుతోంది. <br />నంద్యాల కేబుల్ టీవిలో మంత్రి భూమా అఖిలప్రియ,ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వార్తలను పూర్తిగా నిలిపివేశారట. వీరిద్దరికీ సంబంధించిన ఏ వార్తనూ అక్కడి కేబుల్ టీవీ ప్రచారం చేయడం లేదట. దీని వెనకాల ఏవీ సుబ్బారెడ్డి ఉన్నాడనేది భూమా వర్గం ఆరోపణ. <br />కేబుల్ టీవిలో తమ కార్యక్రమాలను ప్రసారం చేయకపోవడం పట్ల.. దాని యాజమాన్యంతో అఖిలప్రియ మాట్లాడినట్టు తెలుస్తోంది.అయితే.. విషయమేదైనా ఏవీ సుబ్బారెడ్డితోనే తేల్చుకోవాలని యాజమాన్యం చెప్పినట్టు సమాచారం. దీంతో అఖిలప్రియ మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు చెబుతున్నారు. <br />మొదట భూమా అఖిలప్రియ వార్తలను మాత్రమే కేబుల్ టీవిలో ప్రసారం చేయవద్దని నిర్ణయించుకున్నారట. ఆ మేరకు అలాగే చేయగా..ఆమె సోదరుడు,ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి దీనిపై ఏవీ సుబ్బారెడ్డితో మాట్లాడారట. తన సోదరి వార్తలను కూడా ప్రసారం చేయాలని కోరారట. దీంతో ఆమెతో పాటు ఆయన వార్తలను కూడా కేబుల్ టీవిలో ప్రసారం చేయట్లేదని అంటున్నారు. <br />భూమా నాగిరెడ్డి ఆస్తులకు సంబంధించిన ప్రతీ లెక్క ఏవీ సుబ్బారెడ్డికి మాత్రమే కచ్చితంగా తెలుసన్న ప్రచారం ఉంది. ఆయన మరణం తర్వాత ఏవీ సుబ్బారెడ్డి వాటిపై తమకు కచ్చితమైన సమాచారం ఇవ్వట్లేదని అఖిలప్రియ ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారన్న వాదన ఉంది. ఈ క్రమంలోనే అఖిలప్రియ ఏవీ సుబ్బారెడ్డిని దూరం పెట్టడం.. ఆమెకు వ్యతిరేకంగా ఆయన పావులు కదపడం జరుగుతున్నాయంటున్నారు. ఉపఎన్నికల గండమైతే గట్టెక్కింది కానీ.. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో అఖిలప్రియ రాజకీయాలకు, టీడీపీకి ఈ వైరం చేటు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.