<p>Suchitra Ella comments at CII Partnership Summit in Visakha: ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యంలో ఎన్నో సవాళ్లు వచ్చినప్పటికీ భారతదేశం దృఢంగా ముందుకు సాగుతోందని భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్ర ఎల్ల అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ భారత దేశం గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా పెద్ద అడుగులు వేస్తోందని తెలిపారు. భాగస్వామ్యం, ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టినప్పుడే ఆత్మనిర్భర్ భారత్ నిజంగా రూపం దాలుస్తుందని చెప్పారు. కరోనా సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించగలిగిన దేశంగా భారత్ నిలిచిందని సుచిత్ర ఎల్ల గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన జీనోమ్ వ్యాలీ ఎకోసిస్టమ్ దేశానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. అదే జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అందించగలిగిందని సుచిత్ర ఎల్ల అన్నారు. </p>
