<p>Footage Of Before Blowout : అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో రెండ్రోజుల క్రితం ఓఎన్జీసీ సైట్లో బ్లో అవుట్తో పెద్దఎత్తున మంటలు ఎగసి స్థానికులను భీతావహుల్ని చేసింది. సోమవారం ఉదయం మోరి-5 డ్రిల్లింగ్ సైట్లోని బావిలో గ్యాస్ లీక్ కావడంతో భారీ శబ్దంతో అగ్నికీలలు విరుచుకుపడ్డాయి. బ్లోఅవుట్కు ముందు ఉదయం 8 గంటలకు నిక్షేపాల అన్వేషణ జరుగుతున్న సమయంలో తీసిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులో సిబ్బంది తమ విధుల్లో తలమునకలై ఉన్నారు. తర్వాత కాసేపటికి జరిగిన హఠాత్పరిణామం అందర్నీ హడలెత్తించింది.</p><p>అయితే మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బావిలో ఈ నెల 5వ తేదీ (సోమవారం మధ్యాహ్నం) నుంచి 30 మీటర్ల ఎత్తున అగ్నిజ్వాలలు ఆరంభమైన విషయం తెలిసిందే. మంగళవారం నాటికి తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా 10 నుంచి 15 మీటర్లకు పైగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్ పీడన స్థాయి క్రమంగా తగ్గుతుండడంతో ఓఎన్జీసీ చర్యలు ముమ్మరం చేసింది. క్షేత్రస్థాయిలో విపత్తుల నిర్వహణ బృందం (సీఎంటీ), ఆర్సీఎంటీ సభ్యులు చర్యలు మొదలు పెట్టారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా నీటిని పంపింగ్ చేయడంతో బావి సమీప ప్రాంతంలో వేడి తగ్గింది. మరో నాలుగైదు రోజులు ఈ చర్యలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.</p>
