<p>Fourth Day Bull Competitions in Chilakaluripeta : ఆరుగాలం శ్రమించే రైతుల కష్టాన్నిమరిపించేవి ఇలాంటి ఎడ్ల పందేలేనని, అలాంటి పోటీల నిర్వహణకు పూనుకున్న ప్రత్తిపాటి పుల్లారావును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు మంత్రి అనగాని తెలిపారు. తాను హైదరాబాద్లో వ్యాపారం చేసేటప్పుడు పుల్లారావును కలిసి, రాజకీయాలపై నాకున్న ఆసక్తిని తెలియచేస్తే, ఆయన ఎంతగానో ప్రోత్సహించారని సత్యప్రసాద్ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులుగా 4 సార్లు, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, వ్యవసాయమంత్రిగా పనిచేసిన ఆయన అనుభవం తమకెంతో ఉపయోగపడిందన్నారు. ఒంగోలు గిత్తలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుప్రఖ్యాతులు పొందాయని, ఆ జాతికి ఎదురులేదని, అలానే చిలకలూరిపేటలో ప్రత్తిపాటికి తిరుగులేదని అనగాని స్పష్టం చేశారు. ఈ క్షణం కూడా దావోస్ పర్యటనలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి శ్రమిస్తున్నది మనందరి కోసం, రాష్ట్రం కోసమన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళితే, తిరిగి అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు, లోకేశ్లు పని చేస్తున్నారని సత్యప్రసాద్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వాటికి కొనసాగింపుగా ప్రత్తిపాటి జాతీయస్థాయి ఎడ్ల పందేలు నిర్వహించడం నిజంగా అభినందనీయమన్నారు. పెద్ద ఎత్తున పోటీలు ఏర్పాటు చేసిన ప్రత్తిపాటిని ఎమ్మెల్యేలు అభినందించారు.</p>
