<p>Atmakur Tiger Nail News: నంద్యాల జిల్లా నల్లమలలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో పెద్దపులి గోరు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విజ్ఞేశ్ అప్పావ్ తెలిపిన వివరాల మేరకు కొత్తపల్లి మండలంలోని ఎర్రమటానికి చెందిన విష్ణు, గుమ్మడపురానికి చెందిన మురళి అనే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి ఒక పెద్దపులి గోరు లభ్యమైందని తెలిపారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించడం కోసం విచారణ చేస్తున్నామన్నారు. అనుమానితుల వద్ద స్వాధీనం చేసుకున్న పెద్దపులి గోరును ల్యాబ్కు పంపామని, విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిప్యూటీ డైరెక్టర్ విజ్ఞేశ్ తెలిపారు. వృద్ధాప్యం కారణంగా మరణించిన పెద్దపులి నుంచి ఈ గోరును సేకరించి ఉండవచ్చని విజ్ఞేశ్ అప్పావ్ అన్నారు. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలోని అతి పెద్ద పులుల సంరక్షణ కేంద్రం. ఇది తెలంగాణలో నల్గొండ, మహబూబ్నగర్, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలలో సుమారు 3,728 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. </p>
