<p>Interview with Padma Shri Awardee Chandramouli : ఆకాష్ మిస్సైల్ భారత రక్షణ రంగ అమ్ములపొదలో ఒక కీలక మిస్సైల్. ఉపరితలం నుంచే గగనతలంలోని బహుళ లక్ష్యాలను ఛేదించగల ఈ సూపర్ సోనిక్ మిస్సైల్ రూపకల్పనలో కీలక భూమిక పోషించారు ఖమ్మం జిల్లా మధిరకు చెందిన శాస్త్రవేత్త జి చంద్రమౌళి. డీఆర్డీఓ, డీఆర్డీఎల్లో పని చేసి రిటైర్ అయిన ఆయనను పద్మశ్రీ వరించింది. రక్షణ రంగ పరిశోధనల్లో ఆయన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీకి ఆయనను ఎంపిక చేసింది. మేం తయారు చేసిన సూపర్ సోనిక్ మిస్సైల్ను వాడుతున్నారని తెలియడంతో 5 నిమిషాల పాటు ఆనందభాష్పాలు వచ్చాయని, పద్మశ్రీ తనకు రావడం గర్వకారణంగా ఉందని అంటున్న విశ్రాంత శాస్త్రవేత్త జి.చంద్రమౌళితో ప్రత్యేక ముఖాముఖి.</p><p>చంద్రమౌళి నేపథ్యం : మధిర రాయపట్నం వీధిలో ఉన్న గడ్డమణుగు సత్యనారాయణ, అన్నపూర్ణల నాలుగో సంతానం చంద్రమౌళి. చిన్ననాటి నుంచి చదువు, ఆటపాటల్లో చంద్రమౌళి ఎప్పుడూ ముందు ఉండేవాడు. తండ్రి సత్యనారాయణ ఎమ్మార్వో పని చేశారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు. ఉన్నత విద్యావంతులైన కుటుంబమైనా తండ్రికి వ్యవసాయం అంటే ఎక్కువ ఇష్టం. స్థానిక రైతులకు, వ్యవసాయ కూలీలతో వారికి కుటుంబానికి మంచి అనుబంధం ఉండేది. చంద్రమౌళి స్థానిక బ్రాహ్మణ వీధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అయిదో తరగతి పూర్తి చేశారు. మధిర జూనియర్ కళాశాలలోనే ఇంటర్మీడియట్లో చదువుకున్నారు. నేటికీ మధిరకు అప్పుడప్పుడూ వస్తుంటారు. మాజీ రాష్ట్రపతి, అప్పటి డీఆర్డీవో చీఫ్ కలాం బృందంలో మిస్సైల్ విభాగంలో పని చేస్తూ ఆకాష్ క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్గా భారత రక్షణ రంగానికి విశిష్ట సేవలు అందించారు.</p>
