<p>Telangana Municipal Elections 2026 : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివిధ పార్టీల అభ్యర్థులు గొడవలకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సంగారెడ్డిలో పోలీసుల తీరు బాగాలేదంటూ పోలింగ్ ఆపేస్తామంటూ జగ్గారెడ్డి బూత్లోకి దూసుకెళ్లారు.</p><p>34 వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఈ వివాదం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గల్లాను సీఐ పట్టుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. సమాచారం అందుకున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన అనుచరులతో హుటాహుటిన పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. సీఐ ఎలా తమ పార్టీ అభ్యర్థిపై దాడి చేస్తారని పోలీస్ అధికారులను ప్రశ్నించారు. పోలింగ్ ఆపేస్తామంటూ బూత్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రిగ్గింగ్కు సీఐ సహకరిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. సీఐని సస్పెండ్ చేయకపోతే ఎన్నికలను బహిష్కరిస్తానని హెచ్చరించారు. వార్డులో ఎన్నికలు రద్దు చేయాలని పోలింగ్ కేంద్రం వద్ద జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. </p>
