<p>Kalvakuntla Kavitha Visits Tirumala : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన భర్తతో కలిసి శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండలంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దిల్లీ మద్యం కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు కాలినడకన వచ్చానన్నారు. రాబోయే రెండు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు కవిత తెలిపారు.</p><p>కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి కాలినడకన తిరుమలకు వెళ్లారు. గరుడ కూడలికి చేరుకున్న ఆమెకు పలువురు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అలిపిరి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కాలినడకన తిరుమలకు వెళ్లారు. దేవుడి దయ, నీతి నిజాయతీల వల్లే దిల్లీ మద్యం కేసు నుంచి సంపూర్ణంగా బయటపడ్డానన్నారు. కేసు నుంచి విముక్తి లభిస్తే కాలినడకన వచ్చి దర్శించుకొంటానని మొక్కుకున్నట్లు కవిత తెలిపారు. భేషజాలు, భేదభావాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమన్నారు.</p>
