<p>Uday Shankar Clears Group-1 : పేదరికం అతని లక్ష్యానికి ఏమాత్రం అడ్డు పడలేదు. కష్టాలనే సోపానాలుగా మలుచుకున్నాడు. పట్టుదలతో చదివి గ్రూప్-1 అధికారిగా ఎంపికయ్యాడు ఉదయ్ శంకర్. ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో అతను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ ఉద్యోగం సాధించాడు. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఉన్నత కొలువును కైవసం చేసుకున్నాడు ఉదయ్ శంకర్ కుటుంబ పరిస్థితులు మొదటి నుంచి అంతంత మాత్రమే. ఆ పేదరికం నుంచి తన కుటుంబాన్ని ఎలాగైనా బయటపడేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే చదువునే తన అస్త్రంగా మలుచుకుని ముందుకు సాగాడు. ఏకంగా 13 ఏళ్ల పాటు నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతనికి ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. బ్యాంక్, రైల్వే, ఎల్ఐసీ వంటి సంస్థల్లో మంచి కొలువులు వరించాయి. కానీ అతను ఆ ఉద్యోగాల్లో చేరలేదు.</p><p>గ్రూప్-1 లేదా సివిల్స్ వంటి ఉన్నత ఉద్యోగమే అతని ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం ముందు చిన్న ఉద్యోగాలు అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు. ఉదయ్ విజయ ప్రయాణంలో కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ఉంది. ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలని నిరంతరం ప్రోత్సహించారు. ఎట్టకేలకు గ్రూప్-1 ఫలితాల్లో సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా ఉదయ్ ఎంపికయ్యాడు. అయితే తన ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదని ఉదయ్ స్పష్టం చేశాడు. భవిష్యత్లో సివిల్స్ సాధించడమే తన అంతిమ లక్ష్యమని చెబుతున్నాడు. </p>
