<p>Commercial Gas Crisis in AP: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశంలో సహజ వాయువు సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్-ఎస్మాను అమలులోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్కు కృత్రిమ కొరత సృష్టించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. వీటి సరఫరాకు అంతరాయం కలగకుండా, పంపిణీ సమానంగా జరిగేలా తాజాగా పెట్రోలియం శాఖ ఎస్మా ప్రయోగించింది.</p><p>పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గుముఖం పడుతోంది. దీనివల్ల మున్ముందు హోటళ్లను నడపడం అసాధ్యంగా మారబోతోందని సంబంధితులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్లకు కృత్రిమ కొరత సృష్టించే ప్రమాదం కనిపిస్తోందని, తద్వారా వాటిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించే అవకాశం లేకుండా ప్రభుత్వం నిఘా పెంచాలని కోరుతూ రాష్ట్ర స్టార్ హోటల్స్ అసోయేషన్, రాష్ట్ర హోటల్స్ అసోయేషన్ ప్రతినిధులు సంయుక్తంగా రాష్ట్ర సివిల్ సప్లయిస్ డైరెక్టర్ శ్రీవాస్ నుపుర్ అజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. </p><p>ప్రాధాన్యత రంగంగా గుర్తించాలని విజ్ఞప్తి: విజయవాడలోని సివిల్ సప్లయిస్ కార్యాలయంలో డైరెక్టరును కలిసి తమ పరిస్థితిని వివరించారు. గ్యాస్ ధరలు ఇంకా పెరిగి లభ్యత తగ్గితే ఆమేరకు సామాన్యులకు అందించే టిఫిన్లు, భోజనాల ధరలు పెంచాల్సి వస్తోందని తద్వారా అటు వినియోగదారులపై, ఇటు హోటల్ యజమానులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూతపడితే, వాటిలో పనిచేసే వేల మంది కార్మికులు వీధిన పడే ప్రమాదం ఉందని హోటల్ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి కోటా పద్ధతిలో కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.</p>
