<p>Amaravati Phase-1 Ready in 2 Months : రాజధాని అమరావతి నిర్మాణంలో తొలి దశ రూపురేఖలు మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల కోసం నిర్మిస్తున్న నివాస సముదాయాల పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఆయా భవనాల్లో ఇంటీరియర్ పనులు చురుగ్గా జరుగుతున్నాయని అన్నారు. అలాగే ప్రధాన రహదారి అయిన సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉన్న మలుపులు కేవలం తాత్కాలికమే అని మంత్రి స్పష్టం చేశారు. ఈ రహదారి పూర్తి స్థాయి నిర్మాణం కోసం ఇంకా నాలుగున్నర ఎకరాల భూమి అవసరమని ఆయన తెలిపారు. దీనిని సమీకరణ లేదా భూసేకరణ ద్వారా త్వరలోనే సేకరిస్తామని అన్నారు. ఆ భూమి అందుబాటులోకి రాగానే సీడ్ యాక్సెస్ రోడ్డును ఎలాంటి మలుపులు లేకుండా నేరుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాజధాని రహదారుల వెంబడి సుందరీకరణ (బ్యూటిఫికేషన్) పనులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. </p>
