<p>Telangana Thalli Statue At Assembly : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ఉదయం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ ఉపన్యాసం కోసం గవర్నర్ శాసనసభకు వచ్చారు. సమావేశాల కంటే ముందే గవర్నర్ శాసనసభ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పునరుద్ధరించిన శాసనమండలి భవనం ముందు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోనే ఉన్న గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు గవర్నర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతరం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉగాది తరువాత ఈ నెల 20న బడ్జెట్ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. </p>
