<p>Eagle Team On Marijuana And Narcotics : రాష్ట్రంలో తీసుకున్న పటిష్టమైన చర్యల ఫలితంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను చాలావరకు నివారించగలిగామని ఈగల్ టీమ్ ఐజీ ఏ.రవికృష్ణ తెలిపారు. గంజాయి ఎవరు వినియోగించినా, రవాణా చేసినా, విక్రయించినా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం 20 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉందని హెచ్చరించారు. గంజాయి గురించి సమాచారం తెలిస్తే 1972 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. గంజాయి ఇతర మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తున్న ఈగల్ టీం ఐజీ రవికృష్ణ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని డీఅడిక్షన్ సెంటర్ను సందర్శించారు. మాదక ద్రవ్యాలకు బానిసలై, వాటి నుంచి విముక్తి పొందేందుకు అడిక్షన్ సెంటర్లో చేరిన బాధితులతో ఆయన మాట్లాడారు. </p><p>అనంతరం ఐజీ రవికృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చైతన్యం పేరుతో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల ఫలితంగా చాలా వరకు మార్పు తీసుకురాగలిగామన్నారు. ముఖ్యంగా గంజాయి సాగును పూర్తిగా కట్టడి చేశామని చెప్పారు. మెడికల్ అసోసియేషన్లు, షాపు నిర్వాహకులతో సమావేశాలు నిర్వహిస్తూ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నార్కోటిక్ డ్రగ్స్ అమ్మ కూడదని ఆదేశాలు ఇచ్చామన్నారు. </p>
