<p>Mobile Phones Recovery in YSR District: వైఎస్సార్ జిల్లాలో వివిధ రూపాలలో పోగొట్టుకున్న సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కేసు నమోదు చేసి ఐఎంఈఐ ట్రాకింగ్ ద్వారా మొబైల్స్ను గుర్తించి బాధితులకు అప్పగించడం సంతోషంగా ఉందని జిల్లా పోలీస్ అధికారి నచ్చికేత్ విశ్వనాథ్ అన్నారు. 8వ విడతలో భాగంగా రూ. 70 లక్షలు విలువ చేసే 505 సెల్ ఫోన్లు సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేసి ఇవాళ ఎస్పీ చేతులు మీదుగా బాధితులకు అందజేశారు. </p><p>ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రూ. 11.76 కోట్లు విలువ చేసే దాదాపు 5877 సెల్ఫోన్లను మొత్తం ఎనిమిది విడతల్లో రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఎస్పీ ఈ సందర్భంగా వెల్లడించారు. సెల్ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ వారికి సమాచారం ఇస్తే పోలీసులు ఐఎంఈ నెంబర్ ద్వారా మొబైల్ను గుర్తించి స్వాధీన పరుచుకుంటారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆపరేషన్ మోబీ ట్రాక్ ద్వారా సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎవరూ కూడా సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లను కొనుగోలు చేయవద్దని జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు.</p><p>"ఐఎంఈఐ ట్రాకింగ్ ద్వారా రూ. 70 లక్షలు విలువ చేసే 505 సెల్ ఫోన్లను రికవరీ చేశాం. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రూ. 11.76 కోట్లు విలువ చేసే దాదాపు 5877 సెల్ఫోన్లను మొత్తం ఎనిమిది విడతల్లో రికవరీ చేసి బాధితులకు అందజేశాం.సెల్ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే సమాచారం ఇస్తే ఐఎంఈ నెంబర్ ద్వారా మొబైల్ను గుర్తించి స్వాధీన పరుచుకుంటాం"-నచ్చికేత్ విశ్వనాథ్,జిల్లా ఎస్పీ </p>
