<p>surrendered Naxalite Papa Rao Interview : ప్రభుత్వం చేసే దోపిడీని చూసి తాను మావోయిస్టుగా మారానని నక్సలైట్ కీలక నేత, పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్ పాపారావు ఎలియాస్ సున్నం చంద్రయ్య చెప్పారు. మూడు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో పని చేసిన పాపారావు ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ క్రమంలో శనివారం ఆయన 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన సుదీర్ఘ అజ్ఞాత జీవితం, ఎందుకు మావోయిస్టుగా మారారు? మావోయిస్టు పార్టీకి సంబంధించి అంతర్గత విషయాలను ఆయన వివరించారు. 1995 డిసెంబర్లో నక్సలైట్ సంస్థలో చేరినట్లు పాపారావు వెల్లడించాడు. ఆ సమయంలో ప్రభుత్వం ఒత్తిడి ఎక్కువగా ఉండేది, అటవీ ప్రాంతాల్లో గ్రామస్థులను వేధించేవారని పాపారావు పేర్కొన్నాడు. ప్రజల ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలిపాడు. భద్రతా బలగాలు తరచూ పాఠశాల భవనాల్లో క్యాంపులు ఏర్పాటు చేసేవని, పార్టీ ఆదేశాలతో వాటిని ధ్వంసం చేశామని తెలిపాడు. రోడ్లు నిర్మిస్తే భద్రతా బలగాలకు చేరుకోవడం సులభమవుతుందని భావించి వాటికి వ్యతిరేకంగా నిలిచినట్లు వెల్లడించాడు. నక్సలైట్గా ఉన్న సమయంలో అనేక దాడుల్లో పాల్గొన్నానని ఆయన చెప్పాడు. </p>
