<p>Apple Cultivation Success In Anantapur : కరవు సీమలో అనంత ఆపిల్ పండ్ల సాగు అన్నదాతలు సిరులు కురిపిస్తోంది. తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశోధన శాలగా మార్చుకున్న రైతు రమణారెడ్డి అనేక పంటలపై ప్రయోగాలు చేస్తూ అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. గతంలో అనంతపురం జిల్లాలో తొలిసారిగా డ్రాగన్ ఫ్రూట్ సాగుచేసి తన ఇంట సిరులు కురిపించుకున్నాడు. అప్పట్లో డ్రాగన్ ఫ్రూట్ అంటు మొక్కలు తానే తయారు చేసి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రైతులకు చౌకగా విక్రయించాడు. ఈ తరహాలోనే జిల్లాలో ఏడేళ్ల క్రితం ఖర్జూరం సాగుచేసి, శాస్త్రవేత్తలకు పరిశోధన స్థానంగా తన పంట భూమిని మార్చేశాడు. ఖర్జూరంతో నాలుగేళ్లుగా పెద్దఎత్తున దిగుబడి సాధిస్తూ లాభాలు గడిస్తున్నాడు. మరో కొత్త పంటను సాగుచేయాలని ఆలోచించిన ఆ రైతు ఆపిల్ను ఎంపిక చేసుకొని ఇజ్రాయెల్ నుంచి మొక్కలు తెప్పించాడు. 2022లో ఆపిల్ సాగుచేసిన రమణారెడ్డి నెల రోజుల క్రితం తొలి ఆపిల్ దిగుబడి రెండున్నర టన్నులు బెంగుళూరులోని కార్పోరేట్ సూపర్ మార్కెట్కు విక్రయించాడు. వచ్చిన దిగుబడిలో 50 శాతం మాత్రమే విక్రయించిన రైతు రమణారెడ్డి, సగం పంటను కోయకుండా, తోట చూడటానికి వచ్చేవారికి ఆపిల్ పండ్ల రుచి చూపిస్తున్నాడు. ఆపిల్ సాగు గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తోటకు వెళ్లి రమణారెడ్డితో సాగు విధానం, మార్కెటింగ్ పరిస్థితులను తెలుసుకున్నారు. ఆపిల్ సాగు తనకు లాభదాయకంగా ఉందంటున్న అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన రైతు రమణారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.</p>
