<p>YSRCP Leader Clashes with Municipal Commissioner in Krishna District: ఏపీలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు అభివృద్ధిని ఓర్చుకోలేక వాటికి అడ్డంకులను ఏదో విధంగా కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ వ్యవస్థను గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఉదాహరణే కృష్ణాజిల్లా తాడిగడప మున్సిపల్ కమిషనర్తో వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వాగ్వాదానికి దిగడం. పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని కానూరు శివారులో ఆక్రమణాల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారి తీసింది. దాంతో కాలువలపై ఉన్న అక్రమణలను తొలగించేందుకు అధికారులు అక్కడకు వచ్చారు. దాంతో అక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చక్రవర్తి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కమిషనర్ నజీర్ పై అసభ్య పదజాలంతో తీవ్రంగా దుర్భాషలాడారు. ఇప్పటికే వేల్పూరు గ్రామం వద్ద లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చామని చెప్తున్న వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ చక్రవర్తి ఇలా గొడవకు దిగడం సరికాదని కమిషనర్ నజీర్ అన్నారు. </p><p>తాడిగడప పరిధిలోని కానూరు సర్కిల్లో కాలువ గట్లపై ఆక్రమణలను తొలగించి అక్కడున్న వారికి పునరావాసం కల్పించడంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ షేక్ నజీర్, అధికారులతో కలిసి అక్కడికి వచ్చారు. కాలువ గట్లను ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్న 18 కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా రెండేసి సెంట్ల చొప్పున వేల్పూరులో స్థలాలను కేటాయించారు. ఆ పట్టాలను పంపిణీ చేసేందుకు కమిషనర్ షేక్ నజీర్, వీఆర్వో తదితరులు ఏర్పాట్లు చేసుకుంటుండగా వైఎస్సార్సీపీ నేత దేవభక్తుని చక్రవర్తి అక్కడికి చేరుకున్నారు. కనీసం ఏం జరుగుతోంది? ఎందుకొచ్చారని అధికారులను అడిగి తెలుసుకోకుండానే పెద్దగా అరుస్తూ కమిషనర్ మీదకు దూసుకొచ్చి అవమానకరంగా మాట్లాడటం ఆరంభించారు. ‘ప్రభుత్వ అధికారితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి. ప్రజలంతా చూస్తున్నారు’ అంటూ కమిషనర్ వారిస్తున్నా వినకుండా నువ్వు అధికారివే కాదు, నీకు ఏ అధికారం లేదు. ఏం పీక్కుంటావో పీక్కో అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. దీంతో కమిషనర్, ఇతర అధికారులు పట్టాల పంపిణీని ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీకి చెందిన కొంతమంది స్థానికులతో వెళ్లిపోతున్న అధికారులను సైతం రెచ్చగొట్టేలా రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేయించడం గమనార్హం. మేం పట్టాలు పంపిణీ చేసేందుకే వచ్చాం. ఆ స్థలాలు సైతం తీసుకెళ్లి చూపిస్తామంటూ కమిషనర్ ఒకవైపు చెబుతున్నా తీరు మార్చుకోలేదు. మాకు స్థలాలు చూపించండి, పట్టాలు ఇవ్వండి అంటూ మళ్లీ అదే విషయం అడుగుతూ గొడవకు కాలుదువ్వారు.</p>
