<p>MLA Gouthu Sirisha Fires on YSRCP: మహిళా బిల్లు వేళ వైఎస్సార్సీపీ డ్రామాలు ఆడుతోందని, దేశమంతా మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంతోషంగా ఉంటే ఏపీలో వైఎస్సార్సీపీ నేతలు విషం చిమ్ముతున్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష ధ్వజమెత్తారు. నిన్నటి వరకు విలన్లుగా ఉన్న జగన్ టీం,ఇప్పుడు తమ మాటలతో జోకర్లుగా నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేసారు. 2023 ఎన్సీఆర్బీ నివేదికే జగన్ హయాంలోని అరాచకాలకు సజీవ సాక్ష్యమని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి పాలనలో దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే నేరాలు, ఘోరాలు అత్యధికమని అన్నారు. </p><p>పెద్ద రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై దాడులు ఎక్కువగా జరిగాయని గణాంకాలు చెబుతున్నాయని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మాజీ మంత్రి విడుదల రజినీ టీడీపీపై విమర్శలు చేసే ముందు మీ హయాంలో జరిగిన నేరాల చిట్టా చూడండని హితవు పలికారు. జగన్ హయాంలో కులాలు, మతాల అతీతంగా ప్రతి వర్గం మీద వైఎస్సార్సీపీ దమనకాండ సాగించిందని మండిపడ్డారు. రాజధాని ఆడబిడ్డలను రోడ్ల మీద ఈడ్చిన చరిత్రను ఆంధ్రరాష్ట్రం ఎన్నటికీ మర్చిపోదన్నారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను, ముఖ్యంగా మహిళలను ఐదేళ్లపాటు నరకయాతన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. </p>
