<p>Seven Injured As Under Construction Bridge Collapses in Visakh: విశాఖ జిల్లా వడ్లపూడి వద్ద ప్రమాదం జరిగింది. ఆటోనగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో నిర్మాణంలోని వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.</p><p>స్పందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి: ప్రమాదంపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పందించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి ప్రమాద వార్త తెలియగానే ఫోన్ ద్వారా ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటన స్థలాన్ని సందర్శించి, ప్రమాదంపై నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎన్ హెచ్ ఈఎన్సీ రామచంద్ర, ఆర్ అండ్ బి క్వాలిటీ కంట్రోల్ సీఈ శేషు కుమార్, అనకాపల్లి ఈఈ సాంబశివరావులు ఘటనా స్థలాన్ని సందర్శించాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ బాధితులు ఆరోగ్య పరిస్థితిని మంత్రి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.</p>
