<p>CM Chandrababu Naidu On Government Schools 10th Toppers : ఏపీ పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రతిభ కనబరచడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్ పాఠశాలలకే పరిమితమైన టాప్ మార్కుల ట్రెండ్ను మారుస్తూ అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫొటోలతో ప్రభుత్వం ప్రత్యేకంగా పేజీ ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వ విద్య పట్ల ప్రజలకు భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఇది వరకు కార్పొరేట్ సెక్టార్ మాత్రమే చేసే పనిని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది చాలా మంచి విషయం అని సీఎం తెలిపారు. దేశంలోనే ఇదొక నూతన ఒరవడి అని సీఎం అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా, ఎటువంటి విషయంలో కూడా వెనుకంజ వేయకుండా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విద్యా రంగంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. పదవ తరగతిలో ఫలితాలు బాగొస్తే రాజకీయ నాయకులు క్రెడిట్ తీసుకుంటారని సీఎం అన్నారు. నాయకులు క్రెడిట్ తీసుకుంటున్నా సరే రియల్ హీరోస్ అయిన స్టూడెంట్స్ ఫొటోలతో ప్రకటనలు ఇచ్చామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.</p>
