<p>CM Chandrababu On Deputy CM Pawan Kalyan Telangana Issue : తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిపోయిందన్నారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో ఎవరి పాత్ర ఎంతో ప్రజలకు తెలుసు, జరిగిన అభివృద్ధిని చెడగొట్టకుండా లాజికల్గా ముందుకు తీసుకెళ్లడమే ఇప్పుడు మనం చేయాల్సిందన్నారు. ప్రజలకు మంచి చేయడంలో పోరాడాలి తప్ప, ప్రజల మధ్య విభేదాలు తేవడం సరికాదన్నారు. రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. తానూ ఇటీవల తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేశానని సీఎం గుర్తు చేశారు. అనవసరంగా వివాదాలు సృష్టించడం ఎవరికీ మంచిది కాదని హితవుపలికారు. తెలంగాణలో కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు సరికాదని, అలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదని చంద్రబాబు పేర్కొన్నారు. మనం ప్రజలను చైతన్యం చేయడంలో పోటీపడాలి. వారికి మెరుగైన సేవలందించాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించడం సరికాదని చంద్రబాబు వెల్లడించారు.</p>
