<p>MGNREGA Workers Wedding Anniversary In Nizamabad : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పురానిపేట గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలంతా కలిసి వారితో ఉన్న వృద్ధ దంపతులకు షష్ఠిపూర్తి కార్యక్రమం నిర్వహించారు. తెలుగింటి సంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా దంపతుల చేత దండలు మార్పించారు. జీలకర్ర బెల్లం పెట్టించారు. మేళతాళాల మధ్య తాళి కట్టించారు. అక్కడ ఉన్న వారంతా అక్షింతలతో వారిని ఆశీర్వదించారు. వరుడు వధువునకు అరుంధతి నక్షత్రాన్ని చూపించారు. అక్కడికి విచ్చేసిన వారు దంపతులకు కానుకగా నూతన వస్త్రాలను సమర్పించారు. ఇలా సంప్రదాయ బద్ధంగా షష్టిపూర్తి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు నృత్యాలు చేశారు. వారితో పాటు దంపతులూ సరదాగా చిందులు వేశారు. మేళతాళాల నడుమ ఈ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది కాస్త ప్రస్తుతం వైరల్గా మారింది. </p>
