<p>CRDA Commissioner in Velagapudi : రాజధాని అమరావతి ప్రాంతంలోని అన్ని గ్రామాలకు పైపులైన్ల ద్వారా ఇళ్లకు గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు చెప్పారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో రహదారుల నిర్మాణం కోసం భూసేకరణ కింద తీసుకుని పొలాలపై బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో సక్రమంగా తాగునీరు విద్యుత్ సరఫరా జరగడం లేదని ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్లాట్ల అభివృద్ధి పనులను గుత్తేదారు సక్రమంగా చేయటం లేదని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్, సాయంత్రం తన ఛాంబర్కు వచ్చి కలవాలని గుత్తేదారు సంస్థకు చెందిన సిబ్బందిని ఆదేశించారు. అలాగే విద్యుత్ సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. గ్రామస్థులు అడిగిన సమస్యలన్నీ నెల రోజుల్లో పూర్తి చేస్తామని కమిషనర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.</p>
