<p>School Students Meet Collector For Bus : సమయానికి ఆర్టీసీ బస్సు రాక బడికి ఆలస్యంగా వెళ్లి నష్ట పోతున్నామని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లి కె గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా నేరుగా బ్యాగులతో కలెక్టరేట్కు తరలి వచ్చారు. కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమ గోడును వినిపించారు. బస్సు 9.10కి కాకుండా 9.45కి వస్తోందని ఇందువల్ల తాము రెండు పీరియడ్లు నష్టపోతున్నామని వాపోయారు. తమ కోసం బస్సు కొంచెం ముందు వేయండంటే, '7 గంటల బస్సుకు వెళ్లండి, నడుచుకుంటూ వెళ్లండి' అని చెబుతున్నారని కలెక్టర్కు వివరించారు. స్పందించిన కలెక్టర్ స్వయంగా డిపో మేనేజర్కు ఫోన్ చేసి స్కూల్ సమయం కంటే ముందే విద్యార్థులని పాఠశాలకు చేరవేయాలని ఆదేశించారు. అంతే కాకుండా పిల్లలు ఆకలితో ఉన్నారని గమనించి భోజనం పెట్టించి వాహనాల్లో బస్సు స్టేషన్ పంపించాలని డీఆర్డీఓ రవీందర్కు సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు భోజనం పెట్టించి వారిని వాహనాల్లో పంపించారు. కలెక్టర్ సానుకూల స్పందనతో విద్యార్థులు సంతోషంగా తిరుగుముఖం పట్టారు.</p>
