<p>Woman Ties Silver Rakhi To Collector : ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం హృదయాన్ని హత్తుకునే సన్నివేశానికి వేదికైంది. బజారహత్నూర్ మండలం జాతర్ల పంచాయతీ పరిధిలోని రామ్నగర్ నివాసి అయిన మరుగుజ్జు మహిళ ఉయిక సుభద్రకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రత్యేక చొరవతో ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశారు. కలెక్టర్ వెళ్లిన రోజునే ఆమె తన గృహ ప్రవేశం చేసుకున్నారు. కలెక్టర్ రాకకు కృతజ్ఞతగా ప్రజావాణి విభాగానికి వచ్చిన ఆయనకు సుభద్ర రాఖీ కట్టి ఆత్మీయతను చాటారు. కలెక్టర్ ఆమెను చూసిన వెంటనే ఆప్యాయంగా పలకరించగా సుభద్ర ఆయనకు బొట్టు పెట్టి సత్కరించారు. ప్రజావాణి రోజున అందుబాటులో ఉంటారని, రాఖీ పౌర్ణమి రోజున ఉంటారో లేదోనని ముందస్తుగా ప్రత్యేకంగా వెండితో చేసిన రాఖీ కట్టి అభిమానం చాటుకున్నారు. కలెక్టర్ సైతం అన్నయ్యలా సుభద్రకు కానుకలు ఇచ్చి అంతే అభిమానం చాటుకున్నారు. ఈ సన్నివేశాన్ని అధికారులు, అర్జీదారులు ఆసక్తిగా తిలకించారు. ప్రజావాణికి సమస్యలు, అర్జీలతోనే కాదు పనులు చేస్తే అభిమానంతోనూ వస్తారని ఈ ఘటన రుజువు చేసింది.</p>
