<p>AP Government Serious Over Fake Drone News Near Secretariat: కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో సచివాలయంపై డ్రోన్ కలకలం అంటూ వచ్చిన వదంతులపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. శాంతిభద్రతలపై కీలక చర్చ జరిగే సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని పోలీసులు నిర్ధారించారు. దిల్లీ నుంచి విజయవాడ వస్తున్న విమానాన్ని డ్రోన్ కలకలంగా తప్పుడు ప్రచారం చేశారని గుర్తించారు. అలా చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని, కలెక్టర్ల సదస్సు అంశాన్ని పక్కదారికి మళ్లించేందుకే కొందరు తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని ప్రభుత్వ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా అధికారులు హెచ్చరించారు. కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో ఈ విధమైన తప్పుడు సమాచారాన్ని సృష్టించి గందరగోళానికి గురి చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం రోజున ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం రేపిన సంగతిపై స్పందిస్తూ దానికి ప్రభుత్వం స్పందించడం గమనార్హం. </p>
