<p>Minister Anam At The 13th State-Level Boys' and Girls' Beach Kabaddi Championship In Nellore : నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీ నుంచి నాలుగు రోజులు పాటు జరిగిన 13వ రాష్ట్రస్థాయి బాలబాలికల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజేతలకు మంత్రి ఆనం బహుమతులు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి 500 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు హోరాహోరిగా జరిగిన ఈ పోటీలలో బాల బాలికలకు విడివిడిగా పోటీలు నిర్వహించగా నేడు సెమిఫైనల్లో గెలిచిన జట్లు ఫైనల్లో తలపడ్డాయి. బాలికల విభాగంలో విజయనగరం జట్టు మొదటి స్థానంలోనూ శ్రీకాకుళం జట్టు ద్వితీయ స్థానం, నెల్లూరు బాలికల జట్టు తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. అలాగే పురుషుల విభాగంలో మొదటి బహుమతి బాపట్ల జిల్లాకు రాగా ద్వితీయ బహుమతి నెల్లూరు జిల్లా, తృతీయ బహుమతులు పల్నాడు జిల్లాలు కైవసం చేసుకున్నాయి. విజేతలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన మంత్రి ఆనం వారికి షీల్డ్, ప్రశంసపత్రాలను బహుమతులుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆనం కుమార్తె లీలా కైవల్యా రెడ్డి, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు స్థానిక నేతలు పాల్గొన్నారు. </p>
