<p>Gollapudi RTC Bus Fire Accident : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్సు గొల్లపూడి వచ్చేసరికి ఒక్కసారిగా ఇంజన్ క్యాబిన్లో నుంచి మంటలు చెలరేగాయి. మంటలు ఏర్పడటంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును వెంటనే పక్కన నిలిపివేశాడు. అనంతరం బస్సులో ఉన్న ప్రయాణికులు అందరినీ కిందకు దించారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టడంతో బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. </p><p>రెండు నెలల క్రితమే ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు పైభాగానికి ఏకంగా 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. కడప జిల్లా వేంపల్లి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అదృష్టవశాత్తూ అందరూ సకాలంలో అప్రమత్తమై బస్సు దిగడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. దీంతో పోలీసులతో పాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు.</p>
